జనం న్యూస్ , జూన్ 26( జిల్లా ఇంచార్జ్ ) తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలు దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా జూన్ 28న కొడంగల్లో నిర్వహించనున్న కృతజ్ఞత సభను విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు.శుక్రవారం నిర్వహించిన సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఎక్కడి సంజీవరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నీల నాగరాజు మాట్లాడుతూ, చేవెళ్ల వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి కొడంగల్ వరకు చేపట్టనున్న కారు ర్యాలీలో రాష్ట్రంలోని 33 జిల్లాల తెలంగాణ ఉద్యమకారులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చిందని, ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేకే కమిటీని ఏర్పాటు చేయడం ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి సానుకూల పరిణామమని పేర్కొన్నారు. కమిటీ కాలయాపన చేయకుండా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను త్వరితగతిన అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.కొడంగల్లో నిర్వహించే కృతజ్ఞత సభకు కరీంనగర్ జిల్లా సహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులు స్వచ్ఛందంగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మూడేళ్ల కుమారస్వామి, కాన్స్టిట్యూయెన్సీ ఇన్చార్జి ఆరే రమేష్ రెడ్డి, రేణిగుంట్ల రజినీకుమార్, జమ్మికుంట టౌన్ అధ్యక్షుడు మద్దూరి శంకరయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ నర్ర భూమిరెడ్డి, జిల్లా కార్యదర్శి కనవేని సతీష్ కుమార్, రచ్చ గణేష్, అక్కనపెళ్లి నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.