జనం న్యూస్ జూన్ 28, రావికమతం విలేఖరి గుమ్మడి వెంకటేశ్వరరావు ప్రతి వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి అని కొత్తకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) శ్రీ కోటేశ్వరరావు తెలిపారు.శనివారం, కొత్తకోట పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) శ్రీనివాస్ తో కలిసి కొత్తకోట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆటో యూనియన్ మరియు బొలెరో వాహనాల యూనియన్ డ్రైవర్లతో అవగాహన సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ కోటేశ్వరరావుమాట్లాడుతూ, వాహనాల్లో అధిక లోడింగ్ చేయరాదని, ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని సూచించారు. ముఖ్యంగా ఆటో రిక్షాల్లో డ్రైవర్ పక్కన (ఫ్రంట్ సీటులో) ప్రయాణికులను కూర్చోబెట్టరాదని తెలిపారు. అలాగే వాహనాలకు సంబంధించిన అన్ని చెల్లుబాటు అయ్యే పత్రాలు (డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, ఫిట్నెస్, పొల్యూషన్ సర్టిఫికెట్ తదితరాలు) ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకొని, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశానికి కొత్తకోట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆటో, బొలెరో తదితర వాహన యూనియన్ల సభ్యులు, డ్రైవర్లు పెద్ద సంఖ్యలో హాజరై, ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ ప్రజల భద్రతకు సహకరిస్తామని తెలిపారు.