మ్యాగ్నెట్ పాఠశాల తీరుపై ఎస్ఎఫ్ఐ ఆగ్రహం.

*పాఠశాలలోనే పుస్తకాల విక్రయం నిబంధనలకు విరుద్ధమని విమర్శ *విద్యను వ్యాపారంగా మార్చొద్దని హెచ్చరిక. *అధికారుల తక్షణ జోక్యం కోరిన ఎస్ఎఫ్ఐ.

జనం న్యూస్ 27 జూన్ 2026, రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్, సీనియర్ జర్నలిస్ట్ మొహమ్మద్ సమి : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ప్రాంతంలోని మ్యాగ్నెట్ పాఠశాల యాజమాన్యంపై విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాఠశాల ప్రాంగణంలోనే విద్యార్థులకు నోట్‌బుక్స్, టెక్స్ట్‌బుక్స్ విక్రయించడం ద్వారా విద్యను వ్యాపారంగా మారుస్తున్నారని ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్ ఆరోపించారు. పాఠశాలను సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలల్లోనే పుస్తకాల విక్రయాలు నిర్వహించడం తల్లిదండ్రులపై అదనపు ఆర్థిక భారం మోపే చర్య అని విమర్శించారు. విద్యాసంస్థలు విద్యాబోధనకే పరిమితం కావాలని, వ్యాపార కార్యకలాపాలకు వేదికలుగా మారడం ఆందోళనకరమని అన్నారు. ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల అవసరాలను అవకాశంగా తీసుకుని లాభార్జనే లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని, ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను బేఖాతరు చేస్తున్నాయని శ్రీకాంత్ మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తుతో వ్యాపారం చేయడం సమాజానికి మంచిది కాదని పేర్కొన్నారు. పాఠశాలల్లో పుస్తకాల విక్రయాలపై విద్యాశాఖ అధికారులు వెంటనే విచారణ చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యాలపై తగిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. తల్లిదండ్రులు కూడా తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, బలవంతపు కొనుగోళ్లకు గురైతే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించింది. ఎస్ఎఫ్ఐ చేసిన ఆరోపణలపై మ్యాగ్నెట్ పాఠశాల యాజమాన్యం నుంచి అధికారిక స్పందన ఇంకా వెలువడలేదు. ఈ ఆరోపణలపై అధికారుల విచారణ అనంతరం వాస్తవ పరిస్థితులు స్పష్టమయ్యే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు చరణ్, రామ్ చరణ్, సుజనా, వినోద్, ఆదిల్, సాయి, శివ, నాని, రాకేష్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *