జనం న్యూస్ 27 జూన్ 2026, రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్, సీనియర్ జర్నలిస్ట్ మొహమ్మద్ సమి : రంగారెడ్డి జిల్లా షాద్నగర్: పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా పెయింటర్ల పనిరేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ షాద్నగర్ పట్టణంతో పాటు ఉమ్మడి ఆరు మండలాల పెయింటర్లు శనివారం నుంచి నిరవధిక సమ్మెను ప్రారంభించారు. జూన్ 27 నుంచి జూలై 1 వరకు బంద్ను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. షాద్నగర్ ఎంపీడీవో కార్యాలయం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో నిర్వహించిన సమ్మెలో పెద్ద సంఖ్యలో పెయింటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెయింటర్ల సంఘం అధ్యక్షుడు తిరుమల్ మాట్లాడుతూ… గత ఎన్నో సంవత్సరాలుగా పెయింటర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు తక్కువ రేట్లకు పనులు చేయడం వల్ల స్థానిక పెయింటర్లకు ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన పాఠశాల ఫీజులు, పుస్తకాల ఖర్చులు, రవాణా చార్జీలు, నిత్యావసర వస్తువుల ధరల కారణంగా కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. స్థానిక పెయింటర్లకు ఉపాధిలో ప్రాధాన్యం కల్పించి, పనిరేట్లు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. సంఘం గౌరవాధ్యక్షుడు అంజయ్య మాట్లాడుతూ… స్థానిక కార్మికులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల కార్మికులతో పోలిస్తే స్థానికులకు తక్కువ రేట్లు ఇవ్వడం అన్యాయమన్నారు. గ్రామాలు, పట్టణాల్లో బెల్ట్ షాపులు, గుట్కా, గంజాయి వంటి మత్తు పదార్థాల విక్రయాలను అరికట్టేందుకు సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పెయింటర్ల సమ్మెకు సీఐటీయూ నాయకులు రాజు, శ్రీను నాయక్ సంఘీభావం ప్రకటించారు. పెయింటర్ల న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు తమ సంపూర్ణ మద్దతు కొనసాగుతుందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెయింటర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమ్మెలో సంఘం అధ్యక్షుడు తిరుమల్, గౌరవాధ్యక్షుడు అంజయ్య, కార్యదర్శి రాజు, ఉపాధ్యక్షుడు అలం, నాయకులు సుదర్శన్, సతీష్, జాన్, శ్రీశైలం తదితరులతో పాటు ఉమ్మడి ఆరు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో పెయింటర్లు పాల్గొన్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.