జనం న్యూస్ – జూన్ 30 (రిపోర్టర్ రావాడ నాయుడు ): పేద ప్రజల ఆరోగ్య భద్రతకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో దోహదపడుతుందని శృంగవరపుకోట నియోజకవర్గ శాసనసభ్యురాలు కోళ్ల లలితకుమారి పేర్కొన్నారు. ఎల్.కోటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆమె లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఆపదలో ఉన్న పేదలను ఆదుకోవడంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు ముఖ్యమంత్ర సహాయ నిధి ఒక వరం లాంటిదని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ సాయం అందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.ఈ పంపిణీలో భాగంగా పెదకందపల్లి గ్రామానికి చెందిన పెంటకోట చంటి కుమార్తె ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో, ఆమె చికిత్స నిమిత్తం ప్రభుత్వం నుంచి మంజూరైన రూ. 92,373 చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. అలాగే కొట్టాం గ్రామానికి చెందిన నున్నగొప్పుల రామకృష్ణ వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన రూ. 70,830 విలువ గల మరో చెక్కును ఆయనకు అందజేశారు. వైద్య ఖర్చుల కోసం ఆర్థిక ఇబ్బందులు పడుతున్న సమయంలో ప్రభుత్వం అందించిన ఈ సాయంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ, ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.