జనం న్యూస్ జూన్ 27 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్): శ్రీ రమాదేవి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సహకారంతో, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ ఆశీస్సులతో, ప్రముఖ సామాజికవేత్త బూదిలి వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం గోరంట్ల మండలం బూదిలి గ్రామం లో ఉచిత ఆరోగ్య వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని గోరంట్ల ఎస్సీ సెల్ అధ్యక్షులు బూదిలి లక్ష్మిపతి, తెలుగు యువత జనరల్ సెక్రటరీ కగానపల్లి బోయ వెంకటేష్, ఈడిగ బాలయ్య, నడింపల్లి వెంకటేష్ సంయుక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్య నిపుణులు ఉచితంగా పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సలహాలు అందించారు. అలాగే రక్తపోటు, మధుమేహం తదితర వ్యాధులకు సంబంధించిన పరీక్షలు చేసి, అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు.
నిర్వాహకులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ప్రజలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని వైద్య సేవలను వినియోగించుకున్నారు.