జనం న్యూస్ ప్రతినిధి శ్రీరమణ జూలై 02 తేదీ 2026 పీ.ఏ.పల్లి మండలం నల్గొండ జిల్లా న్యూస్. *ప్రతి ఓటును కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ BLAలదే – దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ వివరణ SIR (Special Intensive Revision) ఓటర్ల సవరణ కార్యక్రమంపై బి ఎల్ ఏ లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలకు అవగాహన కల్పించిన దేవరకొండ ఎమ్మెల్యే *శ్రీ నేనావత్ బాలు నాయక్ దేవరకొండ నియోజకవర్గంలోని “పీ.ఏ. పల్లి మండలం మరియు గుడిపల్లి మండలాల కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు), యూత్ కాంగ్రెస్ నాయకులు, ముఖ్య కార్యకర్తల కోసం నిర్వహించిన SIR (Special Intensive Revision) ఓటర్ల సవరణ అవగాహన సదస్సు” కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ గారు మాట్లాడుతూ, ప్రతి ఓటును కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ BLAలపై ఉందని స్పష్టం చేశారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను ప్రతి BLA పూర్తిస్థాయిలో అవగాహనతో నిర్వహించాలని, ప్రతి ఇంటిని సందర్శించి అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొత్తగా 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువత పేర్లను నమోదు చేయడంతో పాటు, తప్పుగా తొలగించిన లేదా పొరపాట్లు ఉన్న ఓట్లను వెంటనే సవరించాలని కోరారు. ఓటు అనేది ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు అని, పౌరునికి ఓటు లేకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందడంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అందువల్ల అర్హులైన ప్రతి ఒక్కరి ఓటును తప్పకుండా నమోదు చేయించి కాపాడాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. అలాగే దేశవ్యాప్తంగా జరుగుతున్న SIR ప్రక్రియలో బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగించే కుట్ర చేస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, అర్హత కలిగిన ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా కాంగ్రెస్ పార్టీ BLAలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి దరఖాస్తును పరిశీలిస్తూ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే బాధ్యతను సమర్థంగా నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ మరియు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి SIR కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, అదే స్ఫూర్తితో దేవరకొండ నియోజక వర్గంలోని ప్రతి బూతును స్వయంగా పరిశీలించి, అర్హులైన ప్రతి ఓటును కాపాడేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే బాలు నాయక్ తెలిపారు. ఇతర ప్రాంతాలకు ఉపాధి కోసం లేదా విద్యాభ్యాసం కోసం వలస వెళ్లిన దేవరకొండ నియోజకవర్గ ఓటర్ల వివరాలను కూడా గుర్తించి, వారి ఒక్క ఓటు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని BLAలు, కార్యకర్తలకు సూచించారు. అనంతరం SIR కార్యక్రమానికి సంబంధించిన నమోదు, మార్పులు, తొలగింపులు, అభ్యంతరాల పరిష్కారం తదితర అంశాలపై BLAలు, బూత్ కమిటీ సభ్యులు, యూత్ కాంగ్రెస్ నాయకులు మరియు ముఖ్య కార్యకర్తలకు ఎమ్మెల్యే సమగ్ర అవగాహన కల్పించి, కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా గుడిపల్లి మండలం సింగరాజుపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ మరియు BLAలు అత్యంత వేగంగా SIR కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తున్నందుకు, వారిని ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ వేదికపై ఘనంగా సన్మానించి అభినందించారు. చివరగా, దేవరకొండ నియోజకవర్గంలోని ప్రతి బూతులో యూత్ కాంగ్రెస్ నాయకులు, చదువుకున్న యువత, పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని, ప్రతి ఓటును కాపాడడంతో పాటు పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కీలక పాత్ర పోషించాలని ఎమ్మెల్యే బాలు నాయక్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీ.ఏ. పల్లి, గుడిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, BLAలు, బూత్ కమిటీ సభ్యులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ముఖ్య కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.