
జనం న్యూస్, మన్యం జిల్లా, సాలూరు. సెప్టెంబర్ 3. రైతు బంధు, ఆరోగ్యశ్రీ రూపకర్త, ఉచిత విద్యుత్ ప్రదాత మరెన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందించిన దివంగత మహానేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా సాలూరు పట్టణంలో ని బోసుబొమ్మ జంక్షన్ లో ఉన్న డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర పార్టీ నాయకులతో కలిసి పూలమాలను వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు అందించారని, పార్టీలకు అతీతంగా ప్రజలందరికి పథకాలను అందించారని, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, 108, వృద్ధాప్య పెన్షన్ వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించి మరణాంతరం కూడా ఆంధ్ర ప్రజల హృదయాల్లో శాశ్వతమైన స్థానమును సంపాదించారని ఆయన తెలియజేశారు. అంతేకాకుండా ప్రస్తుత కూటమి నాయకుల ప్రవర్తనపై ఆయన మండిపడ్డారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ మంత్రులు, నాయకులు తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సాలూరు పట్టణ వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మహిళా కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.