
జనం న్యూస్ సెప్టెంబర్ 2 (టెక్కలి) కోటబొమ్మాళి మండలం :అంతర్జాతీయ అక్షరాస్యతా పక్షోత్సవాల్లో భాగంగా కోటబొమ్మాళి మండల సమావేశ మందిరంలో వెలుగు, ఫీల్డ్ అసిస్టెంట్ సిబ్బందికి ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల అభివృద్ధి అధికారి కిల్లారి నారాయణరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అక్షరాస్యత ప్రాధాన్యత, ప్రతి ఒక్కరికీ విద్యను చేరువ చేయాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి నారాయణ రావు మాట్లాడుతూ, విద్య ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకురావడంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని, తద్వారా కోటబొమ్మాళి మండలాన్ని శతశాతం అక్షరాస్యత సాధించిన మండలంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని కోరారు.కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీకాకుళం జిల్లా వయోజన విద్యాశాఖ ఉప సంచాలకులు ఎం.వి. రమణ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికీ విద్యను చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఉల్లాస్ – అక్షర ఆంధ్ర’ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సమాజంలోని నిరక్షరాస్యులను గుర్తించి వారికి అక్షరజ్ఞానం అందించేందుకు అధికారులు, సిబ్బంది, ప్రజలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.అనంతరం అక్షరాస్యతపై అవగాహన కల్పించే ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ చైతన్య ర్యాలీ నిర్వహించారు. శతశాతం అక్షరాస్యత సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ర్యాలీ ద్వారా ప్రజలకు సందేశాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో ఏ.పీ.ఓ జి. హరిప్రసాద్, సహాయ పథక అధికారి నరేష్ మూర్తి వెంకటేష్, వయోజన విద్యా సూపర్వైజర్లు భుజంగరావు, మూర్తి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.