మేడిపల్లి నక్కర్త లో గుడి నిర్మించారు.. బోర్‌ను పూడ్చేశారు

20–30 ఏళ్లుగా ప్రజల దాహం తీర్చిన బోర్ మోటార్‌కు సమాధి? పోచమ్మ దేవాలయం వద్ద బోర్ పూడ్చివేతపై గ్రామస్థుల విస్మయం.. అధికారుల సమక్షంలోనే జరిగిందా?

జనం న్యూస్ ప్రతినిధి మేడిపల్లి నక్కర్త, సెప్టెంబర్ 2:రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలం మేడిపల్లి నక్కర్త గ్రామపంచాయతీ పరిధిలోని పోచమ్మ దేవాలయం వద్ద చోటుచేసుకున్న పరిణామం ప్రస్తుతం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. నూతనంగా పోచమ్మ దేవాలయాన్ని నిర్మించిన నేపథ్యంలో, అక్కడ గత 20–30 సంవత్సరాలుగా ప్రజలకు తాగునీటిని అందిస్తూ వచ్చిన బోర్ మోటార్‌ను పూడ్చివేయడం పట్ల స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ప్రజల అవసరాలకు ఉపయోగపడిన బోర్.. ఇప్పుడు ఎందుకు పూడ్చివేశారు?స్థానికుల కథనం ప్రకారం.. పోచమ్మ దేవాలయం సమీపంలో ఉన్న బోర్ మోటార్ ఎన్నో సంవత్సరాలుగా గ్రామ ప్రజలకు ఉపయోగపడుతూ వచ్చింది. తాగునీటితో పాటు ఇతర అవసరాలకు కూడా ఆ బోర్ నీటిని వినియోగించుకునేవారని చెబుతున్నారు. అలాంటి బోర్‌ను దేవాలయ నిర్మాణం సందర్భంగా పూడ్చివేయడం ఎంతవరకు సమంజసమని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు.దేవాలయం వద్దే బోర్ మోటార్ అందుబాటులో ఉంటే భక్తులకు, దేవాలయ నిర్వహణకు, స్థానిక ప్రజలకు వివిధ రకాలుగా ఉపయోగపడేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో దేవాలయానికి వచ్చే భక్తులు, కార్యక్రమాలకు హాజరయ్యే ప్రజలకు నీటి అవసరం ఏర్పడితే ఈ బోర్ ఎంతగానో ఉపయోగపడేదని వారు పేర్కొంటున్నారు.చూస్తూ ఉండిపోయారా..?బోర్ మోటార్ పూడ్చివేత సమయంలో గ్రామ ప్రజాప్రతినిధులు అక్కడే ఉన్నప్పటికీ దీనిపై ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సర్పంచ్ సుగుణ, ఉపసర్పంచ్ మధుకర్ రెడ్డి, 11వ వార్డు సభ్యుడు మనోహర జంగయ్య, ఇతర వార్డు సభ్యులతో పాటు మాజీ సర్పంచ్ పాచభాష, మాజీ ఉపసర్పంచ్ బోడ కృష్ణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నట్లు స్థానికులు చెబుతున్నారు.బోర్ మోటార్‌ను పూడ్చివేస్తున్న సమయంలోనే ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అక్కడ ఉన్నప్పటికీ దానిని నిలిపివేయడానికి లేదా ప్రత్యామ్నాయ మార్గం చూపించడానికి ఎందుకు ప్రయత్నించలేదనే చర్చ గ్రామంలో జరుగుతోంది.పూజలు.. అదే సమయంలో బోర్‌కు పూడిక?పోచమ్మ దేవాలయం నూతన నిర్మాణం అనంతరం నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఒకవైపు దేవతకు పూజలు నిర్వహిస్తుండగా.. మరోవైపు ఎన్నో ఏళ్లుగా ప్రజలకు ఉపయోగపడిన బోర్ మోటార్‌ను పూడ్చివేయడం స్థానికులను విస్మయానికి గురిచేసిందని చెబుతున్నారు.“గుడి వద్ద బోర్ ఉంటే భక్తులకు, గ్రామ ప్రజలకు ఉపయోగపడుతుంది. అలాంటి నీటి వనరును పూడ్చివేయాల్సిన అవసరం ఏమొచ్చింది?” అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.బోర్ పూడ్చివేతకు కారణమేంటి?బోర్ మోటార్‌ను పూడ్చివేయడానికి అసలు కారణం ఏమిటి? దేవాలయ నిర్మాణానికి బోర్ అడ్డుగా ఉందా? లేక మరేదైనా సాంకేతిక లేదా పరిపాలనా కారణం ఉందా? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. బోర్‌ను పూడ్చివేయడానికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకున్నట్లయితే, దానికి సంబంధించిన వివరాలను గ్రామపంచాయతీ అధికారులు వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు.ప్రజలకు ఉపయోగపడే నీటి వనరుల పరిరక్షణ ఎక్కడ?ప్రస్తుతం అనేక గ్రామాల్లో తాగునీటి సమస్యలు నెలకొంటున్న సమయంలో, గత రెండు మూడు దశాబ్దాలుగా ప్రజలకు ఉపయోగపడిన బోర్ మోటార్‌ను పూడ్చివేయడంపై అధికారులు దృష్టి సారించాలని గ్రామస్థులు కోరుతున్నారు. ప్రజా అవసరాలకు ఉపయోగపడే నీటి వనరులను పరిరక్షించాల్సిన బాధ్యత స్థానిక సంస్థలపై ఉందని వారు పేర్కొంటున్నారు.దేవాలయ అభివృద్ధితో పాటు ప్రజల అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. బోర్‌ను పూడ్చివేయడం వల్ల భవిష్యత్తులో నీటి అవసరాలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అధికారులు విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి.ఈ వ్యవహారంపై సంబంధిత పంచాయతీ, రెవెన్యూ అధికారులు పరిశీలించి వాస్తవాలను వెల్లడించాలని గ్రామస్థులు కోరుతున్నారు. బోర్ మోటార్ ఎప్పటి నుంచి వినియోగంలో ఉంది? దానిని పూడ్చివేయడానికి ఎవరి అనుమతి ఉంది? ఎందుకు పూడ్చివేయాల్సి వచ్చింది? పూడ్చివేతకు ముందు ప్రత్యామ్నాయ నీటి వసతి కల్పించారా? అనే అంశాలపై స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.దశాబ్దాలుగా ప్రజల దాహం తీర్చిన బోర్‌కు పూడిక పడటంతో.. “అభివృద్ధి అంటే ఉన్న వనరులను తొలగించడమేనా?” అనే ప్రశ్న ఇప్పుడు మేడిపల్లి నక్కర్త గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.