
జనం న్యూస్ సెప్టెంబర్ 3 ముద్దనూరు : స్థానిక జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్లో ముద్దనూరు మండల పరిషత్ అధ్యక్షురాలు పుష్పలత మధ్యాహ్న భోజన పథకాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాధాకృష్ణ వేణి కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షురాలు పుష్పలత విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. వంటగది పరిసరాలను, భోజనం తయారు చేసే విధానాన్ని క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారాన్ని అందించాలని వంట ఏజెన్సీ నిర్వాహకులను ఆదేశించారు. భోజనం తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్య విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.