
జనం న్యూస్ సెప్టెంబర్ 3 ( కొయ్యూరు రిపోర్టర్ సూపర్ స్టార్ కృష్ణ )అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీ పరిధిలోని గరిమండ ప్రభుత్వ ఉప ప్రాథమిక పాఠశాల (జీయూపీఎస్)లో బుధవారం మధ్యాహ్న భోజనం నిలిచిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముందస్తు సమాచారం లేకుండా పాఠశాలలో భోజనం అందించకపోవడంతో మధ్యాహ్నం భోజనం కోసం ఇళ్లకు వెళ్లిన చిన్నారులకు నిరాశే ఎదురైంది.ఉదయం పిల్లలను పాఠశాలకు పంపించిన తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లడంతో ఇళ్ల వద్ద ఎవరూ లేకపోవడంతో పలువురు విద్యార్థులు మధ్యాహ్న భోజనం లేక ఆకలితో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. గిరిజన ప్రాంతాల్లో విద్యార్థుల పోషకాహారాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం పట్ల ఇలాంటి నిర్లక్ష్యం వహించడం పట్ల తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పాఠశాలలో భోజనం ఎందుకు నిలిచిపోయిందనే విషయంపై విద్యాశాఖ ఉన్నతాధికారులు తక్షణమే విచారణ చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ ఘటనకు పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యమా, మధ్యాహ్న భోజన నిర్వాహకుల తప్పిదమా అన్నది విచారించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యాశాఖ అధికారులు పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.